2జీ స్కామ్‌ లేకపోతే మోదీ, కేజ్రివాల్‌ ఎక్కడుండేవారు!?

22 Dec, 2017 14:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా ప్రకంపనలు సష్టించిన ‘2జీ స్పెక్ట్రమ్‌’ స్కామ్‌ కేసుపై ఏళ్ల తరబడి సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం ఇందులో స్కామూ లేదు, గీము లేదంటూ ప్రత్యేక సీబీఐ కోర్టు తేల్చి చెప్పడం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. ఈ స్కామ్‌ వల్ల కేంద్ర ప్రభుత్వం ఖజానాకు దాదాపు 1.76 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్‌ నివేదిక పేర్కొనడం, ఇదే స్కామ్‌పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పురస్కరించుకొని 122 టెలికామ్‌ లైసెన్స్‌లను సుప్రీం కోర్టు రద్దు చేయడం సంగతి ఏమిటీ?

122 టెలికామ్‌ లైసెన్స్‌లను రద్దు చేయడం వల్ల అనేక కంపెనీలు నష్టపోయాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా దివాలాతీసి కంపెనీలనే మూసివేశాయి? వాటి సంగతేమిటీ? వాటికి జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఎవరు భర్తీ చేస్తారు? అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? లైసెన్స్‌ల రద్దు ప్రభావం 5.3 కోట్ల టెలిఫోన్‌ కనెక్షన్లపై ప్రభావం చూపిందన్నది ఓ అంచనా. ఆ నష్టానికి ఎవరు బాధ్యులు ?

టైమ్‌ మేగజైన్‌ పది అత్యంత అధికార దుర్వినియోగం కేసుల్లో ఒకటిగా పేర్కొన్న ‘2జీ స్పెక్ట్రమ్‌’ కారణంగా అప్రతిష్టపాలైన యూపీఏ ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? కేవలం ఈ కుంభకోణం కారణంగానే అవినీతి నిర్మూలన నినాదంతో 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు రావడం, ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్న విషయం తెల్సిందే. ఇలా ఓ ప్రభుత్వాన్నే మార్చేసిన కుంభకోణం కేసులో ఏమీ లేదని కోర్టు తేల్చడం వల్ల ఏర్పడిన శూన్యాన్ని ఎవరు భర్తీ చేశారు ? 2జీ స్కామ్‌ కారణంగానే దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించిన అన్నా హజారే ఇప్పుడు కోర్టు తీర్పు సరైనదేనంటూ సమర్థించడం ఎంతవరకు సబబు? ఆయన ఉద్యమం నుంచే అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆయన పార్టీ పుట్టుకొచ్చిన విషయం తెల్సిందే. అసలు 2జీ స్కామ్‌ అనేది అప్పుడే లేకపోతే నేడు ప్రధానిగా మోదీ, ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రివాల్‌ ఉండేవారు కాదేమో!

మరిన్ని వార్తలు