ఆ దేశాల్లో ఓటు వేయకుంటే కఠిన చర్యలు

15 Mar, 2019 14:01 IST|Sakshi

సాక్షి, చిట్యాల (నకిరేకల్‌) : మన ప్రజాస్వామ్య భారత దేశంలో ఓటు వజ్రాయుధం. ఓటు వేయటం ద్వారా మన భవిష్యత్‌ను మనమే నిర్ణయించుకోవచ్చు. కానీ మన దేశంలోని ఓటర్లు మాత్రం ఎన్నికల్లో ఆరవై శాతానికి మించి ఓటును వేయటం లేదు. దీంతో కొన్ని సార్లు చిత్తశుద్ధితో పనిచేసే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఎన్నిక కాకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడుతుండడమే కాకుండా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఓటు వేయటం తప్పని సరి. ఒక వేళ ఓటు వేయకపోతే వారిపై కఠిన చర్యలు, శిక్షలను విధిస్తాయి.

ఓటు తప్పనిసరి చేసిన దేశాలు 
ఆస్ట్రేలియా,  అమెరికా, ఆస్ట్రియా, అర్జెంటీనా, బెల్జియం, గ్రీస్, ఇటలీ, మెక్సికో, ఫిలిప్పిన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, టర్కీ, స్విర్జర్లాండ్, బ్రెజిల్, బొలీలియో వంటి దేశాలలో ఓటు వేయటం తప్పని సరి. ఈ దేశాలలోని అర్హులైన పౌరులు ఓటు వేయకపోతే వారిపై పలు రకాల చర్యలు, శిక్షలను, జరిమానాలను విధిస్తారు.  

బెల్జియంలో..
బెల్జియం దేశంలో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోకపోతే రెండు నుంచి నాలుగు వేల యూరోలు (భారత కరెన్సీలో రూ.3 లక్షలకుపైగా) జరిమానా, రెండోసారి ఓటు హక్కును వినియోగించుకోకపోతే పది వేల యూరోలు (భారత కరెన్సీలో 8 లక్షలకు పైగా) జరిమానా విధిస్తారు. వరుసగా నాలుగు సార్లు ఓటు హక్కును వినియోగించుకోకపోతే పది సంవత్సరాల పాటు వారి ఓటు హక్కును తొలగిస్తారు. అంతేకాకుండా వీరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, సదుపాయాలు, పథకాలను తొలగిస్తారు.భారీగా జరిమానా విధిస్తుంది.

సింగపూర్‌లో..
వేగంగా ఆభివృద్ధి చెందిన దేశాలలో  సింగ్‌పూర్‌ ఒకటి. ఈ దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పని సరి. ఈ దేశంలో ఒక్కసారి ఓటు హక్కును వినియోగించుకోకపోయినా వారి పేరు ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. మరలా ఓటు హక్కును పునరుద్ధరించాలంటే ఓటు వేయకపోవడానికి సరైన కారణం చూపాల్సి ఉంటుంది.  

గ్రీస్‌లో..
గ్రీస్‌ దేశంలో ఓటు హక్కును వినియోగించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ఓటు హక్కును వినియోగించుకోని వారి పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు. ప్రభుత్వం నుంచి పొందే సదుపాయాలను కోల్పోవాల్సి వస్తుంది.   

అమెరికాలో.. 
అమెరికా వంటి దేశంలో పోలింగ్‌ రోజు ఎలాంటి హడావుడి ఉండదు.  అంతేకాకుండా పోలింగ్‌ రోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆఫీసులకు, పాఠశాలలకు సెలవులు ఉండవు. అయినా 75 శాతానికి పైగా పోలింగ్‌ నమోదవుతుంది. ఇక్కడ కూడా ఓటు వేయకపోతే వారికి కొన్ని పథకాలను తొలగిస్తారు. ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.

ఆస్ట్రేలియాలో..
ఆస్ట్రేలియా ఎన్నికల్లో తొంబై ఆరు శాతానికిపైగా పోలింగ్‌ నమోదవుతుంది. ఈ దేశంలో ఎన్నికలు మొదలయ్యే కొన్ని నెలల ముందు నుంచే అక్కడి అధికారులు ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఇక్కడే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. లేనట్లయితే ఓటు వేయని వారిని గుర్తించి వారికి అక్కడి ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది.   

మరిన్ని వార్తలు