ఇమ్రాన్‌ ఖాన్‌పై మాజీ భార్య తీవ్ర ఆరోపణలు

29 Jul, 2018 16:22 IST|Sakshi

ఫలితాలు ఊహించినవే

ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగింది

సైన్యం చేతిలోకి విదేశాంగ శాఖ

ఇస్లామాబాద్‌: తాజా పాకిస్థాన్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహం ఖాన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరగడం వల్లే ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికల్లో గెలిచారని ఆమె ఆరోపించారు. పాక్‌ సైన్యం నుంచి ఇమ్రాన్‌ లబ్ధి పొందాడని, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశాక విదేశాంగ శాఖ సైన్యం చేతిలోకి వెళ్లిపోతుందని ఆమె పేర్కొన్నారు.

తాజాగా పాకిస్థాన్‌లోని 270 స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ సారథ్యంలోని పీటీఐ 115 స్థానాలు గెలుపొందినట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్‌ సమాయత్తమవుతున్నారు. త్వరలోనే పాక్‌ ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీఎన్‌ఎన్‌-న్యూస్‌ 18తో రెహాం ఖాన్‌ మాట్లాడారు. ‘పాక్‌ ఎన్నికలు ఆశ్చర్యపరచలేదు. ఫలితాలు ఊహించినవే. చాలామంది ఇమ్రాన్‌ను ప్రోత్సహించారు. ఆయనపై ఎంతో పెట్టుబడి పెట్టారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగింది. ఆర్మీ ఇప్పుడు పాక్‌ విదేశాంగ శాఖను నిర్వహించబోతోంది’ అని రెహం ఖాన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు