సాక్షి, చెన్నై: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని అధికార, ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. సోమవారం డీఎంకే నేతకు సంబంధించిన ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించగా.. అట్టపెట్టేల్లో రూ. 20 కోట్లు పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా అన్నాడీఎంకే నేత, మంత్రి కేసీ వీరమణి సన్నిహితుడి నివాసంలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 15 కోట్లు పట్టబడ్డాయి. వీరమణి సన్నిహితుడు, కాంట్రాక్టర్ అయిన సబీశన్ నివాసంలో ఈ సొమ్ము పట్టుబడింది.
మంత్రి కేసీ వీరమణికి చెందిన పలు కంపెనీల్లో టీడీపీ నేతలైన రామాంజనేయులు, బ్రహ్మానందం భాగస్వాములుగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతల ద్వారానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల కోసం కోట్లాది రూపాయలు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సబీశన్ నివాసంలో ఐటీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎంకే అధినేత స్టాలిన్ ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేయడంతో ఐటీ అధికారులు సంబంధిత వీడియోలు విడుదల చేశారు.