వైఎస్‌ పథకాల స్ఫూర్తితో..

8 Oct, 2018 01:04 IST|Sakshi
రైతు సమ్మేళనంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌

రైతాంగాన్ని ఆదుకుంటాం: ఉత్తమ్‌

ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపుతాం

కోదాడ: దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేశారని, వాటిని స్ఫూర్తిగా తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ కృతనిశ్చయంతో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో రైతురాజ్యం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. నాడు రుణమాఫీ ఒకేసారి చేసి చూపిన ఘనత దివంగత సీఎం వైఎస్సార్‌దేనని గుర్తుచేసుకున్నారు. అందరూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదని చెప్పినా వైఎస్‌ మాత్రం ఉచిత విద్యుత్‌ ఇచ్చారని పేర్కొన్నారు.

అదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ ఒకేసారి చేసి చూపుతామన్నారు. మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, దానిని అధిగమించేందుకు రూ.5 వేల కోట్లతో నిధిని ఏర్పా టు చేసి మద్దతు ధరపై రైతులకు బోనస్‌ ఇస్తామన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో చేరుస్తా మని తెలిపారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో రైతుల కు పంటల బీమా సరిగా అమలు కాలేదనన్నారు.

బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో ప్రీమియం వసూలు చేసుకుంటున్నాయని, కానీ పంట నష్టం జరిగినప్పుడు మాత్రం ఆదుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతురాజ్యం ట్రస్ట్‌ అధ్యక్షుడు కళ్లెం ఉపేందర్‌రెడ్డి, జిల్లా అద్యక్షుడు హసన్‌బాద్‌ రాజేశ్, కోదాడ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతి, మాజీ ఎంపీ బలరాం నాయక్, డీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి బుర్రి శ్రీరాములు, బండ్ల గణేశ్, టీజేఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పందిరి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు