సాక్షి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర వెనకబాటుతనంపై విశాఖపట్నం, అమరావతిలలో మేధావుల సదస్సు ఏర్పాటు చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. శ్రీకాకుళం పర్యటనలో మాట్లాడుతూ..శ్రీకాకుళం ప్రజలు ఆదరిస్తే శ్రీకాకుళం నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. టీడీపీ ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల్లో చాలా అక్రమాలు జరిగాయని తెలిపారు. 2019లో జనసేన అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీల అంతు చూస్తామని చెప్పారు. గుజరాత్లో అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తే దానిని కొవ్వాడలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాలుష్యం వల్ల 26 లక్షల ఎకరాల సాగుభూమి నిర్వీర్యం అయిపోతుందని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి అమరావతి చుట్టూ మాత్రమే కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు. టీడీపీలో విగ్రహాలకు ఉన్న రక్షణ ప్రజలకు లేకుండా పోయిందని మండిపడ్డారు. 10 మండలాల్లో కిడ్నీ చావులు భయంగొల్పుతుంటే స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.