కర్ణాటక కాంగ్రెస్‌ తొలి జాబితా ఆలస్యం

14 Apr, 2018 03:55 IST|Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాల కారణంగా అభ్యర్ధుల తొలి జాబితా ఆలస్యం కానుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం 180 మంది అభ్యర్ధులతో తొలి జాబితా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ రెండు సార్లు సమావేశమైనప్పటికీ అభ్యర్ధుల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదనీ, శనివారం మరోసారి సమావేశం కానున్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. పార్టీ సీనియర్‌ నేతలంతా ఎవరికి వారు తమ సొంత జాబితా తయారు చేసుకుని రావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన జేడీ(ఎస్‌), బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వటంపై కొందరు నేతలు అభ్యంతరం చెబుతున్నట్లు సమాచారం.  సీఎం సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వర, కొందరు సీనియర్‌ మంత్రుల కుటుంబీకులకు టికెట్లు ఇవ్వటంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు