చంద్రబాబు అవినీతిపై దర్యాప్తు జరపాలి
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా పెద్ద విషయమేమీ కాదని, నిధుల రాకడే ప్రధానమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన సీఎం చంద్రబాబు సర్కారుపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, పార్టీ నేతలు అవినీతిలో కూరుకుపోయినట్లు టీడీపీకే చెందిన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు తనకు చెప్పారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాలనాపరంగా పది పాయింట్లకుగానూ చంద్రబాబుకు 2.5 పాయింట్లు, కేసీఆర్కు 6 పాయింట్లు ఇస్తానన్నారు.
ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అభిప్రాయం వ్యక్తపరిచారు. ‘‘ఏపీలో వెనుక బడిన ఏడు జిల్లాలు అత్యంత దుర్భర స్థితిలో ఉన్నాయి. వీటిని మెరుగుపర్చాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలి. ఏ రూపంలో ఇస్తారనేది ముఖ్యం కాదు. ప్రత్యేక హోదా పేరిట ఇస్తారా? లేదా అనేది ముఖ్యం కాదు. కేంద్రం నుంచి మాకు కావాల్సింది ఆర్ధిక సహాయం. ’’అని పవన్ అన్నారు.