ఉరవకొండలో ఎన్నికల అధికారుల నిర్వాకం

22 May, 2019 21:47 IST|Sakshi
ఎన్నికల అధికారిణి స్వరూపారాణిని నిలదీస్తోన్న వైఎస్సార్‌సీపీ నేతలు

అనంతపురం: ఉరవకొండలో ఎన్నికల అధికారుల నిర్వాకం బయటపడింది. ఫోటోలు లేవన్న కారణంతో 13 మంది వైఎస్సార్‌సీపీ నేతలకి ఉరవకొండ ఆర్‌వో శోభాస్వరూపారాణి కౌంటింగ్‌ పాసులు ఇవ్వలేదు. ఫోటోలతో కూడిన దరఖాస్తులు వైఎస్సార్‌సీపీ నేతలు ఇదివరకే సమర్పించినా కూడా వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్ల ఫోటోలు కావాలని తొలగించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఉరవకొండ కౌంటింగ్‌ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా చేసి, కౌంటింగ్‌లో అక్రమాలు చేసేందుకు కుట్ర రచించినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఈ విషయంపై ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లకు కౌంటింగ్‌ పాసులు ఇవ్వాలని, ఫోటోలు తొలగించిన వారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు సహకరిస్తున్న ఉరవకొండ ఎన్నికల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నేతలకు కౌంటింగ్‌ పాసులు ఇవ్వకపోవడంపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌ రెడ్డి కుమారుడు ప్రణయ్‌ రెడ్డి, ఎన్నికల అధికారిణి స్వరూపారాణితో వాగ్వాదానికి దిగారు. పయ్యావులకు ఉరవకొండల ఎన్నికల అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు