కత్తి వదిలేసినోడు యుద్ధం ఎలా చేస్తాడు?

10 Sep, 2018 12:21 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కోదండరాం

మెదక్‌ జోన్‌:  కత్తి వదిలేసినోడికి యుద్ధం ఎలా చేతనవుతుందని, మళ్లీ ఓట్లు ఎలా అడుగుతాడని ఆపద్ధర్మ ముఖ్యంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మండిపడ్డారు. జనసమితి ఆధ్వర్యంలో ఆదివారం మెదక్‌ పట్టణంఓని టీఎన్‌జీఓ భవన్‌లో జనసమితి జిల్లా చైర్మన్‌ చడిమెల యాదగిరి అధ్యక్షతన రచ్చబండ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రూ. 1.39 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అందులో 70శాతం నిధులను దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ అడ్డు తగులుతుందని లేనిపోని బురద చల్లే ప్రయత్నం చేస్తుందన్నారు.

భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసినందుకు మాయలమరాఠి కేసీఆర్‌ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనంతరం  టీజేఎస్‌ జిల్లా చైర్మన్‌ చడిమెల యాదగిరి మాట్లాడుతూ  నియంత ్చ్ఛ వ్యవహారించిన టీఆర్‌ఎస్‌ పార్టీని ఇంటికీ పంపేందుకు అన్ని శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికులను, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు కులసంఘాలను సైతం మోసం చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బతికించేందుకు నోట్లు ముఖ్యం కాదని గ్రామగ్రామాన ప్రజలను చైతన్యం చేసి టీఆర్‌ఎస్‌ను ఓడిచేందుకు అందరం ఏకం కావాలన్నారు. అనంతరం టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొలుకురి జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ... మెదక్‌ నియోజకవర్గంపై పూర్తి వివక్ష కొనసాగిందన్నారు.

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి ఆస్తులు పెంచుకునే పనిలో ఎమ్మెల్యే, అమె భర్త అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 22 కిలోమీటర్ల మెదక్‌ – చేగుంట, 2 కిలోమీటర్ల మెదక్‌ రోడ్డును నాలుగు సంవత్సరాలుగా నిర్మాణాలు చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లను డబ్బుల కోసం వేధించడంతో వారు పనులు వదిలి వెళ్లిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం 10 మందికి కూడా ఉపాధి చూపించని పద్మాదేవేందర్‌ రెడ్డికి ఓట్లు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేట, సంగారెడ్డితో పొల్చుకుంటే ఒక్కశాతం కూడా మెదక్‌ అభివృద్ధి చెందలేదన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులతో పాటు కులసంఘాలు, విద్యాసంఘాలు, విద్యార్థిసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుప్రబాతరావు, మామిండ్ల ఆంజనేయులు, బాల్‌రాజ్, కాముని రమేష్, దయాసాగర్, శ్రీకాంత్, గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేడీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి

శివ్వంపేట(నర్సాపూర్‌): రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి నవాబుపేట గ్రామంలో జెండావిష్కరణ చేశారు. గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్‌పార్టీ ప్రత్యేక తెలంగాణను ఇవ్వడం జరిగిందని దాన్ని ఆసరాగా తీసుకొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని రంగాల్లో ప్రజలను మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించకుండా ఇచ్చిన వాగ్ధానాలన్నింటిని తుంగలో తొక్కిందన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దళితులకు మూడెకరాలభూమి, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయిందన్నారు. అధికార దాహంతో సీఎం కేసీఆర్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయనను గద్దె దింపే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సైనికుడి వలే పార్టీ విజయానికి కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు యాదాగౌడ్, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు