మా పార్టీలో సింగిల్‌ హీరోలుండరు

25 Jun, 2019 02:27 IST|Sakshi

అఖిల భారత స్థాయిలో రాహుల్‌ ఒక్కరే హీరో

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు 

సాక్షి, హైదరాబాద్‌ : జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో రాష్ట్రాల్లో సింగిల్‌ హీరోలు ఉండరని, అఖిల భారత స్థాయిలో రాహుల్‌ గాంధీ ఒక్కరే హీరో అని, రాష్ట్రాల్లో పార్టీలో ఉన్న నేతలంతా హీరోలేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క, షబ్బీర్‌అలీ.. ఇలా చాలా మంది నేతలు పీసీసీ అధ్యక్ష పదవి అడుగుతున్నారు. వీరంతా సమర్థవంతమైన నాయకులే. చాలా మంది హీరోలున్నారు. అందులో నేనూ ఒక హీరోనే. ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి అడుగుతున్న 10 మంది హీరోలకు తోడు నేను కూడా పదకొండో హీరోగా ఆ పదవిని అడుగుతున్నా. నేను పీసీసీ అధ్యక్షుడిని కావాలనుకుంటున్నా’అని ఆయన చెప్పారు.

సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికలు, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలయ్యేవరకు పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌నే కొనసాగించాలని, ఉత్తమ్‌ను ఎప్పుడు మార్చినా తన పేరును పీసీసీకి పరిగణనలోకి తీసుకోవాలని కుంతియాను కోరానని చెప్పారు. పార్టీ తన విజ్ఞప్తిని పరిగణించి ఆ అవకాశం ఇస్తే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. పార్టీలో జవసత్వాలు నింపి అధికారంలోకి తీసుకువచ్చే మెడిసిన్‌ తన దగ్గర ఉందని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో 50శాతం మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు