కేటీఆర్‌కు భజన చేసుకో.. చెంచాగిరి కాదు..!

2 Jan, 2020 14:15 IST|Sakshi

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌పై జగ్గారెడ్డి ఆ‍గ్రహం

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభ్యంతరకరంగా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాహుల్‌ స్థాయికి, కేటీఆర్‌ స్థాయికి పోలిక ఎక్కడా అని ​ప్రశ్నించారు. ప్రధాని పదవిని వద్దని త్యాగం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని, కేటీఆర్‌ను ఆయనతో పోల్చడం సరికాదని అన్నారు. కేటీఆర్‌ను పొగుడుకో, భజన చేసుకో తప్పులేదు కానీ కేటీఆర్ దగ్గర చెంచాగిరి చెయ్యకు అని హితవుపలికారు. మంత్రులు రాహుల్ గాంధీ గురించి చిల్లర విమర్శలు మానుకోవాలని లేకపోతే, తాము కూడా అదే తరహలో ప్రతి విమర్శలు చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు.

గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందిన విమర్శించారు. డబ్బు, పోలీస్, ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ విరివిగా వాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు, మద్యం పంపిణీ చేస్తుంటే వారికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారని ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంత అధికార దుర్వినియోగం ఎప్పుడూ చేయలేదన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను కేసులతో ఇబ్బందులు పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారుకు నోటీఫికేషన్‌కు కనీసం వారం పది రోజులు వ్యవధి ఉండాలి. ఎన్నికల అధికారి నాగిరెడ్డి టీఆర్ఎస్‌కు అమ్ముడు పోయారు. ఐఏఎస్ అధికారులు అధికార పార్టీకి ఊడిగం చేయడం మానుకోవాలి. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఎంత అభివృద్ధి చేశారో టీఆర్ఎస్ సర్కార్‌ చెప్పగలదా. సంగారెడ్డికి మంచి నీటి ఇబ్బందులకు మంత్రి హరీష్ రావు ప్రధాన కారణం. మా నియోజకవర్గ ప్రజల మంచినీటి కష్టాల గురించి మాట్లాడని హరీష్.. స్కూల్స్ లో పిల్లలను లెక్కలు అడుగుతున్నారు. సర్కార్ బడుల్లో పిల్లల చదువులు అద్వాన్నంగా ఉన్నాయని చెప్పే పనిలో హరీష్ ఉన్నారు. ప్రవేటు స్కూల్స్ తరుపున హరీష్ పని చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు