కేసీఆర్‌ను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే.. 

22 Oct, 2018 01:36 IST|Sakshi

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 

హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ కక్షల సంస్కృతిని తీసుకొచ్చిన కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను రోడ్లపై తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా కేసులో బెయిల్‌పై వచ్చిన ఆయన కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాడు దృతరాష్ట్రుడు కళ్లు లేక పాలన చేస్తే నేడు కళ్లు ఉండి కేసీఆర్‌ దృతరాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

నాలుగేళ్లుగా నియంత పాలన కొనసాగించిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడే వారి గొంతులు నొక్కుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ మొదలు ఆయనకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై ఉక్కుపాదం మోపుతూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆఖరికి హైకోర్టు ఆదేశించినా ఈ ప్రభుత్వం ధర్నాలకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. మీడియా యాజమాన్యాలను సైతం బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ సమస్యలు పక్కదోవ పట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్‌ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌లో కథనోత్సాహం వచ్చిందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని టీఆర్‌ఎస్‌ విమర్శించటం దారుణమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు