జఫ్పాల మాదిరి మాట్లాడొద్దు: జలీల్‌ ఖాన్‌

22 Apr, 2018 10:00 IST|Sakshi

విజయవాడ: ‘బీకాంలో ఫిజిక్స్‌’ వ్యాఖ్యలతో పాపులరైపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ మరోసారి నోరు విప్పారు. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపై ఆరోపణలు గుప్పిస్తున్న పవన్‌ కల్యాణ్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు. సీఎం సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, ఈ విషయంలో బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

పవన్‌ విధానాలు మనలేవు: ‘‘నిన్నటిదాకా చంద్రబాబును, లోకేశ్‌బాబును తెగపొడిగిన పవన్‌ కల్యాణ్‌.. ఇవాళ యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు? కొన్ని టీవీ చానెళ్లను చూడొద్దని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలు అసలు మనలేవు. గతంలో చిరంజీవి చేసినట్లే పవన్‌ కాపులను మోసం చేస్తున్నారు’ అని జలీల్‌ ఖాన్‌ అన్నారు.

జఫ్పాల మాదిరి మాట్లాడొద్దు: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదని జలీల్‌ వెనకేసుకొచ్చారు. ‘ఈ విషయంలో చంద్రబాబుపై బీజేపీ నేతలు జఫ్ఫాల మాదిరి మాట్లాడుతున్నార’ని విచిత్రమైన పదాజాలాన్ని వాడారు. ఏపీకి మోదీ చేసిన అన్యాయంపై మాట్లాడే దమ్ముందా అని ప్రశ్నించారు. మోదీకంటే చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర అని, దమ్ము, ధైర్యంలో బాబును మించినవారు లేరని జలీల్‌ ఖాన్‌ చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు