నెలాఖరులోగా అభ్యర్థుల జాబితా పూర్తి
నియంతృత్వ పాలనను అంతమొందించేందుకు ఎదురుచూపు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారం ఖాయం
సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి
సాక్షి, నాగార్జునసాగర్ : మహాకూటమి పొత్తులు వారం రోజుల్లో ఖరా రవుతాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి తెలిపారు. కలిసివచ్చే పార్టీలతో చర్చలు సాగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. నాగార్జునసాగర్లోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలాఖరునాటికి అభ్యర్థుల జాబి తా ను పూర్తి చేసి ప్రకటించనున్నట్టు జానారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో నాలుగేళ్లు సాగిన నియంతృత్వ, దోపిడీ పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.నాలుగేళ్లు దోచుకున్న సొమ్ముతోనే టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి విని యోగిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజలకు డబ్బులిచ్చి స భలకు రప్పించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.ఆత్మగౌరవమంటూ గద్దెనెక్కిన ప్రజలను ముంచిన టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ది దిగజారుడు రాజకీయం
ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ది దిగజారుడు రాజకీయమని జానారెడ్డి ధ్వజమెత్తారు. అందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను కాపీ కొట్టడమే నిలువెత్తు నిదర్శనమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలనే కేసీఆర్ పేర్లు మార్చి అమలు చేశారని విమర్శించారు. ఆ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన పథకాలన్నీ విఫలమయ్యాయన్నారు.డబుల్బెడ్రూం, దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లిం, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు తదితర ఎన్నికల హామీలన్నీ అమలు చేయలేక ప్రజల వద్దకు పోతే ఈసడించుకుని తిరగబడుతారనే భావనతోనే ముందస్తు ఎన్నికలకు పోయారన్నారు. కేవలం అధికారం కోసమే ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త పథకాలు ప్రకటిస్తూ వాగ్దానాలు చేస్తున్నారన్నారు. ప్రజలు కేసీఆర్ను నమ్మే స్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.