చంద్రబాబులా పవన్‌ దొంగదీక్ష చేయలేదు: జనసేన

17 Oct, 2018 12:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ: జనసేన పార్టీ గురించి ఏపీ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు జనసేన రాష్ట్ర కోఆర్డినేటర్‌ చింతల పార్ధసారధి, జాయింట్‌ కోఆర్డినేటర్‌ పోతిన మహేశ్‌ తెలిపారు. విజయవాడలో చింతల, పోతిన  విలేకరులతో మాట్లాడారు. కవాతుకు వచ్చిన జన స్పందన చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ నాయకులకు జనసేన గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్ని కంపెనీలకు భూములు ఇచ్చారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మైనార్టీ, గిరిజనులకు మంత్రి పదవులు ఇ‍వ్వలేని అసమర్థ ప్రభుత్వం టీడీపీది అని విమర్శించారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లకు భజన చేయడం రాష్ట్రంలో పాలన సజావుగా సాగడం లేదని ధ్వజమెత్తారు.

చంద్రబాబులాగా పవన్‌ కల్యాణ్‌ దొంగ దీక్షలు చేయలేదని మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా టీడీపీ మారిందని వాఖ్యానించారు. అవినీతి నీటిపారుదల శాఖామంత్రి దేవినేని   ఉమా మహేశ్వరరావు సొంత నియోజకవర్గంలోనే మంచి నీళ్లు ఇ‍వ్వలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి జవహర్‌ కొవ్వూరుతో పాటు తిరువూరులో కూడా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీకి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. టీడీపీ అవినీతిపై బహిరంగ చర్చకు తాము సిద్ధం..టీడీపీ నాయకులు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. సినీ నటుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్‌కు జనసేన పార్టీతో ఎటువంటి సంబంధం లేదని, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు