‘విజయవాడ టీడీపీ నాయకుల సొత్తా?’

13 Nov, 2018 13:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో రాజకీయ పార్టీల కటౌట్ల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంపై జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆ పార్టీ నాయకులు మంగళవారం నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌ చాంబర్‌ ముందు ధర్నాకు దిగారు. అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  నగరంలో టీడీపీ కటౌట్లు తప్ప ఇతర పార్టీలకు చెందిన కటౌట్లను పెట్టనియడం లేదని ఆరోపించారు. ఒకవేళ కటౌట్లు పెట్టినప్పటికీ.. 24 గంటలలోపే తొలగిస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ నేతలకు చెందిన కటౌట్లకు అనుమతి లేకపోయిన వాటిని నెలల తరబడి చూసిచూడనట్టు వదిలేస్తున్నారని తెలిపారు. విజయవాడ టీడీపీ నాయకుల సొత్తు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నగరంపై అన్ని పార్టీలకు సమాన హక్కు ఉందన్నారు.

మరిన్ని వార్తలు