లోకేశ్‌పై మరో బాంబు పేల్చిన జనసేన

21 Mar, 2018 18:29 IST|Sakshi

లోకేశ్ అవినీతికి సంబంధించిన ఆధారాలున్నాయి

40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: జనసేన

సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌పై జనసేన మరో బాంబు పేల్చింది. మంత్రి లోకేశ్ అవినీతికి సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని జనసేన నేతలు చెబుతున్నారు. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం లోకేశ్ అవినీతికి సంబంధించి తనకు అన్ని వ్యవహారాలు తెలుసునని, ఆధారాలున్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా లోకేశ్ అవినీతి భాగోతం తమకు తెలుసునంటూ జనసేన నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా సీఎం చంద్రబాబుకు తెలుసునని పేర్కొన్నారు.

మంత్రి లోకేశ్ అవినీతి వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఆయన అవినీతిపై ఢిల్లీ స్థాయి ఏజెన్సీతో విచారణ చేపట్టాలని కోరుతామని తెలిపారు. త్వరలో ఏపీ మంత్రులు, వారి కుటుంబ సభ్యుల బండారం బయటపెట్టేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్న భూములకు సంబంధించి అన్ని లెక్కలు తమ వద్ద ఉన్నాయని ఆ పార్టీ నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ వివరించారు. జనసేన పార్టీ ఆవిర్భావసభలో లోకేశ్ అవినీతిపై, చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలపై పవన్ విమర్శించిన నేపథ్యంలో లోకేశ్‌, జనసేన మధ్య రాజకీయాలు వేడెక్కాయి.

మరిన్ని వార్తలు