‘20న ఏపీలో నిరసన కార్యక్రమాలు’

9 Dec, 2018 14:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు తీవ్ర అన్యాయం చేశాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందులో రాష్ట్రంలోని బీసీ వర్గాలు పెద్ద ఎతున​ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల స్థితిగతులపై అధ్యయన కమిటీ  వేసే వరకు చంద్రబాబుకు బీసీలు గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు బీసీలను పట్టించుకోకుండా మోసం చేసిన చంద్రబాబు.. ఆదరణ అంటూ నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీలకు ఏం చేశాడని చంద్రబాబు జయహో బీసీ సభ పెడుతున్నాడని నిలదీశారు. చంద్రబాబును బీసీ ద్రోహిగా అభివర్ణించారు. బీసీలను బెదిరించి ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. టీడీపీ సభ్యత్వం కట్టలేదని పశ్చిమ గోదావరి జిల్లాలోని బీసీలపై దాడులు చేయడం దారుణమన్నారు. బీసీలకు కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు ఇచ్చి సరిపెడతారా అని ప్రశ్నించారు. తమ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తామని అన్నారు. 

మరిన్ని వార్తలు