జయప్రద ఓటమి

23 May, 2019 19:31 IST|Sakshi

రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన సీనియర్ హీరోయిన్‌ జయప్రద ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఉత్తర ప్రదేశ్‌ లోని రామ్‌పూర్‌ నుంచి బరిలో నిలిచిన జయప్రదపై ఆమె సమీప ప్రత్యర్థి, సమాజ్‌ వాది పార్టీ అభ్యర్థి ఆజాంఖాన్‌ లక్ష 40 వేలకు పైగా మెజారిటీ సాధించారు.

తెలుగు, హిందీ సినిమాలతో నటిగా తార స్థాయిని అందుకొని తరువాత జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముంద్ర వేసిన సీనియర్‌ నటి జయప్రద. ఎన్టీఆర్ ఆహ్వానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయప్రద తరువాత చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా తెలుగు రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ సమాజ్‌ వాది పార్టీలో చేరి రెండు సార్లు ఎంపీగా గెలిచి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమాజ్‌ వాదీ పార్టీలో విభేదాలు రావటంతో అమర్‌సింగ్‌తో కలిసి రాష్ట్రీయ లోక్‌ మంచ్‌ పార్టీని స్థాపించారు. 2011లో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసిన ఈ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు.

తరువాత కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన జయప్రద అడపాదడపా సినిమాల్లో నటించారు. మూడేళ్ల విరామం తరువాత అమర్‌ సింగ్‌తో కలిసి ఆర్‌ఎల్‌డీ పార్టీలో చేరిన జయప్రద 2014 జనరల్‌ ఎలక్షన్స్‌లో బిజ్‌నూర్‌ నియోజిక వర్గం నుంచి లోక్‌సభకు పోటి చేసి ఓడిపోయిన ఆమె 2019 జనరల్‌ ఎలక్షన్స్ కు ముందుకు బీజీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోసారి రామ్‌పూర్‌ నుంచి పోటిచేసి ఓటమి పాలయ్యారు.

మరిన్ని వార్తలు