చంద్రబాబుపై జేసీ సంచలన వ్యాఖ్యలు

22 Jun, 2018 15:23 IST|Sakshi

కుయుక్తులు పన్నడంతో పాటు.. అన్నీ బాబుకు తెలుసు

సీఎం రమేష్‌ వల్ల ఉక్కు కాదు కదా తుక్కు కూడా రాదు

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి

సాక్షి, కడప : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు జేసీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏం తక్కువవాడు కాదని.. నాటకాలడటం, డ్రామాలు ఆడించడం, మాటలు చెప్పడం, కుయుక్తులు పన్నడం అన్నీ తెలుసునంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఏమీ చేయట్లేదని జేసీ అన్నారు.

సీఎం రమేష్‌కు పిచ్చిపట్టి దీక్ష చేస్తున్నారని, ఇలాంటి దీక్షల వల్ల ఉక్కు పరిశ్రమ కాదు కదా.. తుక్కు పరిశ్రమ కూడా రాదని విమర్శించారు. దీక్షలో నిజాయితీ లేదని, మందులతో సాగుచేసిన తిండి తింటున్న వారిలో నిజాయితీ ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అని, రాష్ట్రానికి ప్రధాని ఏమీ చేయరని విమర్శించారు. గుజరాత్‌ సీఎంగా ఉండగా ఒక వర్గాన్ని హత్యలు చేసిన మోదీ.. ప్రధానిగా ఉండటానికి అర్హత లేదన్నారు. 

ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని జేసీ ఆరోపించారు. గతంలో ఎస్సీ ఎస్టీ చట్టం బలంగా ఉన్నప్పుడు వారిపై ఎవరైనా చేయి వేయాలంటే భయపడే వారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హయాంలో పోలీసులన్నా, లాఠీలన్నా ప్రజల్లో భయం లేకుండా పోయిందని అన్నారు. ఇదిలావుండగా జేసీ వ్యాఖ్యలు విన్న తెలుగుదేశం నేతలు ఖంగుతిన్నారు. సొంత పార్టీ నేతలపైనే జేసీ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, తెలుగు తమ్ముళ్లు ఒక్కసారి అవాక్కయ్యారు.

మరిన్ని వార్తలు