సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి క్రమంగా స్పష్టమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ నెలకొనడంతో తక్కువస్థానాలతో మూడో స్థానానికి పరిమితమైన జేడీఎస్ పాత్ర కీలకంగా మారనున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతానికి అందుతున్న కౌంటింగ్ సరళి, ట్రెండ్స్ను బట్టి.. బీజేపీ 78 స్థానాలు, కాంగ్రెస్ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 27 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఫలితాల సరళిలో ఇలాగే కొనసాగితే.. హంగ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో మూడోస్థానంలో ఉన్న జేడీఎస్ మద్దతు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుంది. అలా జరిగిన పక్షంలో జేడీఎస్ ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ జేడీఎస్ మద్దతు కోసం తీవ్రంగానే ప్రయత్నించే అవకాశముంది.