మంచి క్యాండిడేట్‌ లేడు.. సీటు మీరే తీసుకోండి!

25 Mar, 2019 16:03 IST|Sakshi

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో పేరుకు మిత్రపక్షాలుగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ కూటమిని అనేక చిక్కులు వెంటాడుతున్నాయి. ఇరు పార్టీల మధ్య సరైన సమన్వయం, సయోధ్య లేకపోవడం.. పాత బద్ధవైరాన్ని పక్కనబెట్టి.. పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం.. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమిని చిక్కుల్లో పడేస్తోంది. 

లోక్‌సభ ఎన్నికల పొత్తులో భాగంగా పట్టుబట్టి మరీ ఎనిమిది సీట్లు తీసుకున్న జేడీఎస్‌.. ఇప్పుడు తనకు కేటాయించిన స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టలేక చేతులు ఎత్తేస్తోంది. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. మొదట జేడీఎస్‌ 12 స్థానాలు కావాలని పట్టుబట్టింది. ఆ తర్వాత కాస్తా తగ్గి.. స్థానాలకు పొత్తు కుదుర్చుకుంది. కానీ, దేవెగౌడ కుటుంబసభ్యులు మినహా చాలాచోట్ల ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం.. సంకీర్ణ కూటమిని ఇరకాటంలో నెట్టుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద మనస్సు చేసుకున్న జేడీఎస్‌ తనకు కేటాయించిన బెంగళూరు నార్త్‌ టికెట్‌ను తిరిగి కాంగ్రెస్‌ పార్టీకే ఇచ్చేసింది. సరైన అభ్యర్థి దొరకకపోవడంతో తమ సీటును తిరిగి మిత్రపక్షం కాంగ్రెస్‌కు ఇస్తున్నామని ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్‌ కర్ణాటక ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ ట్విటర్‌లో స్పందిస్తూ జేడీఎస్‌కు థాంక్స్‌ చెప్పారు. ఇలాగే కర్ణాటకలో మిత్రధర్మాన్ని పాటిస్తూ రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు