కర్ణాటక: బీజేపీకి కుమారస్వామి మద్దతు!

27 Jul, 2019 13:09 IST|Sakshi

కుమారస్వామి ముందు రెండు ప్రతిపాదనలు

ప్రభుత్వంలో భాగమా.. ప్రజల తరఫున పోరాటమా?

మద్దతుకు పలువురు ఎమ్మెల్యేలు మొగ్గు

సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. తదుపరి బలపరీక్షపై వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా  జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ సభ్యుల మద్దతును కోరతారా అనేది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు శుక్రవారం రాత్రి జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా రెండు ప్రతిపాదనలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మాజీ మంత్రి జీవీ దేవెగౌడ ఈ వివరాలను వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి ప్రభుత్వంలో భాగస్వామి కావడమా? లేక ప్రజల్లో ఉంటూ యడియూరప్పపై పోరాటం చేయడమా? అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. అయితే ఈ భేటీలో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు సుముకంగా ఉన్నారని వెల్లడించారు. తనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యే మద్దతుకు సిద్ధంగా ఉన్నామని.. దీనిపై కుమారస్వామి తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో కుమారస్వామి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌తో జేడీఎస్‌ చెలిమిని కొనసాగిస్తుందా? బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతుందా? కాంగ్రెస్‌తో చెలిమికి గుడ్‌బై చెప్పి, బీజేపీ ప్రభుత్వంపై ఒంటరిగానే పోరాటం చేస్తుందా? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. మరోవైపు బీజేపీ కూడా జేడీఎస్‌ సభ్యుల మద్దతు కోరడంపై ఆలోచనలు చేస్తున్నట్ల తెలిసింది. వారితోపాటు రెబల్స్‌ను కూడా తమవైపునకు తిప్పుకునేందుక ప్రయత్నలను ముమ్మరం చేస్తోంది కమళ దళం. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షపై ఉ‍త్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది.

మరిన్ని వార్తలు