ఫలితాలపై ఉత్కంఠ: బీజేపీకి ఓటమి తప్పదా!

22 Dec, 2019 20:02 IST|Sakshi

రేపు జార్ఖండ్ అసెం‍బ్లీ ఎన్నికల ఫలితాలు

బీజేపీకి షాకిచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్‌ అనంతరం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు అధికార బీజేపీకి కంగుతినిపించాయి. కమళనాథులకు ఈసారి ఓటమి తప్పదని పలు సంస్థలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్, జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌-జేఎంఎం కూటమికి 50కిపైగా స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. బీజేపీ 22-30 స్థానాలకే పరిమితం కానున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి. దీంతో రేపు విడుదలైయ్యే ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. జేఎంఎం 43, కాంగ్రెస్ 31, ఆర్జేడీ 7 సీట్లలో పోటీ చేశాయి. బీజేపీ 79 సీట్లలో బరిలో సొంతంగా బరిలో దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 52, జార్ఖండ్ వికాస్ మోర్చా 81 సీట్లలో పోటీ చేశాయి. (ఎగ్జిట్‌పోల్స్‌: బీజేపీకి ఎదురుదెబ్బ)

2014లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీకి 37, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 5, జార్ఖండ్ ముక్తి మోర్చా 19, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. జేవీఎం (పీ) పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించినా, వారు ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీకి 2014లో ఒక్క సీటు కూడా రాలేదు.
 

మరిన్ని వార్తలు