విజయవాడ: గత మూడు రోజులుగా టీడీపీ నేతలు పూనకం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. శుక్రవారం రాష్ట కార్యాలయంలో మాట్లాడిన జోగి రమేష్.. ప్రజలంతా టీడీపీ నాయకుల్ని చీ కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వైఎస్సార్సీపీపై టీడీపీ ప్రబుద్ధులు విష ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ‘ మూడు రోజులుగా టీడీపీ నాయకులకు పూనకం వచ్చింది, పిచ్చి ముదిరింది. జనమంతా వేప మండలు, చీపుర్ల తో వారి పూనకం పోగొట్టాలి. ఫెడరల్ ఫ్రంట్పై ఇండియా, పాక్ యుద్ధం లాగా టీడీపీ అండ్ కో, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కేసీఆర్తో మాకెందుకు పొత్తు, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. హరికృష్ణ శవం పక్కన బెట్టుకుని కేసీఆర్తో పొత్తుకు ప్రయత్నించిన మాట వాస్తవం కాదా. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.
ప్రత్యేక హోదా అంశం నిలబెట్టింది జగన్ మాత్రమే. ఉమా మాయల ఫకీరు నాటకంలో డైలాగులు చెప్తున్నారు. కేసీఆర్కు సిగరెట్ కూడా అంటించిన ప్రబుద్ధులు టీడీపీ నేతలు. చంద్రబాబు రాష్ట్రంలో నో ఎంట్రీ బోర్డ్ పెట్టారు. కానీ జనం మూడు నెలల్లో చంద్రబాబుకి నో ఎంట్రీ బోర్డ్ పెట్టబోతున్నారు. చంద్రబాబు లాంటి రాజకీయ తార్పుడు లేడని ఎన్ఠీఆర్ స్వయంగా చెప్పారు. చంద్రబాబు, ఆయన తాబేదార్లకు మూడు నెలల్లో పూనకం వదిలించబోతున్నారు’ అని జోగి రమేష్ ధ్వజమెత్తారు.