‘నూజివీడు సీఐ, ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలి’

9 Dec, 2018 13:24 IST|Sakshi

సాక్షి, నూజివీడు: పట్టణంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేశ్‌ ఆరోపించారు. శనివారం పురపాలక సంఘం చేపట్టిన సిమెంట్‌ రోడ్డు ప్రారంభోవత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావ్‌కు టీడీపీ నేతలు అడ్డుతగిలి, వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నూజివీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ప్రజా ప్రతినిధికి రక్షణ కల్పించకపోగా.. ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన సీఐ, ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్‌ సీపీ తరఫున డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నూజివీడు సీఐ, ఎస్‌ఐలను వెంటనే సస్పెండ్‌ చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

వెంకట ప్రతాప్‌ అప్పారావు మాట్లాడుతూ.. 18వ వార్డులో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది ఆందోళన కారులను అడ్డుకోలేక.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్లిన తనను పర్మిషన్‌ పేరుతో పోలీసులు గంటకు పైగా రోడ్డుపై నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా నూజివీడు సీఐ పథకం ప్రకారమే చేశారని మండిపడ్డారు. భవిష్యత్‌లో తనకేదయినా ప్రాణహాని జరిగితే ఇప్పుడున్న సీఐ బాధ్యత వహించాలన్నారు. ఉన్నతాధికారులు నూజివీడు సీఐ, ఎస్‌ఐలను బదిలీ చెయ్యాలని కోరారు.

చదవండి: నూజివీడులో ‘టీడీపీ’ హైడ్రామా

మరిన్ని వార్తలు