అబద్ధాలతో అధికారంలోకి
కశ్మీర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై వ్యాఖ్యలు
ప్రధాని విదేశీ పర్యటనలపై సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సర్కార్పై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి ధ్వజమెత్తారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందటూ తీవ్ర విమర్శలకు దిగారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు తప్పుడు వాగ్దానాలు చేసిందని దుయ్యబట్టారు. గురుగావ్లో శివసేన 52వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన థాకరే మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ టూర్లపై కూడా థాకరే సెటైర్లు వేశారు. త్వరలోనే ప్రధాని ఇతర గ్రహాల పర్యటనకు కూడా వెళ్లనున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జమ్మూ కశ్మీర్లో పీడీపీ ప్రభత్వానికి మద్దతు ఉపసంహరణపై థాకరే విమర్శలు గుప్పించారు. 600 మంది జవాన్లు ప్రాణత్యాగం, మూడు సంవత్సరాల సమయం గడిచిన తరువాత గానీ అక్కడి ప్రభుత్వం వేస్ట్ అని అర్థం కాలేదా అంటూ మండిపడ్డారు. పీడీపీతో తెగతెంపులు చేసుకున్నారు. మరిక పాకిస్థాన్పై కూడా ఒత్తిడి తీసుకురండి..అప్పుడు బీజేపీని స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేనపుడు, రంజాన్ రోజు కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించిందని ఆయన ప్రశ్నించారు. గణపతి పండుగ లేదా దసరా సమయంలో పాకిస్తాన్ ఇదే విధానాన్ని అనుసరిస్తుందా అంటూ రంజాన్ మాసంలో కశ్మీర్లో కాల్పుల విరమణ నిర్ణయాన్ని థాకరే తప్పు బట్టారు.