మా అక్కను గెలిపించండి : ఎన్టీఆర్‌

17 Nov, 2018 10:58 IST|Sakshi

మహాకూటమి తరపున ప్రచారం చేస్తా : బాలకృష్ణ

సాక్షి, హైదరాబాద్‌ : కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తమ సోదరి సుహాసినిని భారీ మెజారిటీతో గెలిపించాలని నందమూరి హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సేవకు సిద్దపడుతున్న తమ సోదరి సుహాసిని భారీ విజయం సాధించాలని ట్విటర్‌ వేదికగా ఆకాంక్షించారు. 

తాత, తండ్రికి నివాళులు.. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సుహాసిని తాత, దివంగత సీఎం ఎన్టీఆర్‌, తండ్రి నందమూరి హరికృష్ణలకు నివాళులర్పించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి సమాధి వద్దే  నామినేషన్‌ పత్రాలపై సంతకం చేశారు. బాబాయ్‌ నందమూరి బాలకృష్ల, ఇతర కుటుంబసభ్యులతో ‍కలిసి తొలుత ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లిన ఆమె..  అనంతరం మహాప్రస్థానంలోని తన తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌, హరికృ‍ష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు స్పూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. తనకు తెలుగు మహిళలు మద్దతు ఇవ్వాలని కోరారు. శనివారం ఉదయం 11.21నిమిషాలకు నామినేషన్‌ వేశారు.

బాలకృష్ణ మాట్లాడుతూ.. నందమూరి ఆడపడుచు సుహాసిని గెలుపు కోసం యువత, అభిమానులు, కార్యకర్తలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. తమ ఆశయాలను సుహాసిని ముందుకు తీసుకెళ్తారని, తెలంగాణలో ప్రజాకూటమిదే విజయమని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. బహిరంగ సభల్లో, రోడ్‌షోలలో పాల్గొంటానన్నారు. ఈ నెల 26 నుంచి ప్రచారం ప్రారంభిస్తానన్నారు.

>
మరిన్ని వార్తలు