బస్తీమే సవాల్‌!

12 Apr, 2018 07:02 IST|Sakshi
మాట్లాడుతున్న జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు

టీడీపీ అవినీతి, అక్రమాలపై ప్రజల మధ్య చర్చకు సిద్ధమా? 

సవాల్‌ విసిరిన జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు  

ఎమ్మెల్యే బుగ్గన ఆరోపణలు ముమ్మాటికి వాస్తవం

డోన్‌ : నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కొనసాగిస్తున్న దోపిడీ, అవినీతి పనులపై పీఏసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చేసిన ఆరోపణలు ముమ్మాటికి వాస్తవమని జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు అన్నారు. పార్టీ నాయకులు కోట్రికె హరికిషన్, దినేశ్‌గౌడ్, పోస్ట్రుపసాద్, ఆర్‌ఈ రాజవర్ధన్, ఓబులాపురం మదన్‌తో కలిసి ఎమ్మెల్యే స్వగృహంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నాయకులకు సవాల్‌ విసిరారు. వ్యాపారుల ముక్కుపిండి అక్రమంగా వసూళ్లు చేయలేదని టీడీపీ నాయకులు దేవుడి ఎదుట ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా.? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాధి తుల గోడు విని మాట్లాడితే పసలేని పత్రికా ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. 
టికెట్‌ రాదనే భయం... 
టీడీపీ నాయకుల అవినీతి చిట్టా ఆ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినందున వచ్చే ఎన్నికల్లో వారి నాయకుడికే ఎమ్మెల్యే టికెట్‌ దక్కదనే భయం పట్టుకుందని శ్రీరాములు అన్నారు. టీడీపీ నాయకుల గుండాయిజం, రౌడీయిజం, అవినీతి, అక్రమాల గురించి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. 
గురువింద గింజలు... 
అవినీతి, అక్రమాల ఊబిలో కూరుకుపోయిన టీడీపీ నాయకులకు దిక్కుతోచడం లేదని శ్రీరాములు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బుగ్గన రీజినబుల్‌ మైనింగ్‌ వ్యాపారం చేయడంలో రాష్ట్రంలోనే పేరుగాంచిన సంగతిని టీడీపీ నాయకులు తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యేపై వారు చేసిన ఆరోపణలు గురువింద గింజలు సామేతను గుర్తుకు తెస్తోందని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు. సమావేశంలో పార్టీ నాయకులు రాజశేఖర్, మహేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు