తొలి రోజే టీడీపీకి షాకిస్తున్న రెబల్స్‌.. 

18 Mar, 2019 13:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: నామినేషన్ల పర్వం మొదలైన రోజే టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. పలువురు టీడీపీ రెబల్‌ అభ్యర్థులు తొలి రోజే తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రెబల్స్‌ నామినేషన్ల పర్వం ఓ వైపు.. పార్టీలో అసమ్మతి నేతల మరోవైపు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మెజారిటీ జిల్లాలో ఇలాంటి పరిస్థితులే నెలకొనడం టీడీపీకి మింగుడుపడని అంశంగా మారింది. రెబల్స్‌ను బుజ్జగించాలని చూస్తున్న టీడీపీ నేతల ప్రయత్నాల ఫలించడంలేదు. 

రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి త్రిమూర్తులు రాజు...
విజయనగరం:
 జిల్లాలో తొలి నామినేషన్ అధికార పార్టీ రెబెల్ అభ్యర్థితో మొదలైంది. టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కె తిమూర్తులు రాజు సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. చీపురుపల్లి టికెట్‌పై ఆశపెట్టుకున్న త్రిమూర్తులు రాజుకు నిరాశే మిగిలింది. దీంతో ఆయన టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ చీపురుపల్లి టికెట్‌ను ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగర్జునకు కేటాయించింది. దీనిని వ్యతిరేకిస్తూ త్రిమూర్తులు రాజు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం తన నివాసంలో సమావేశమయ్యారు. కిమిడి మృణాళిని కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వద్దన్న పార్టీ పట్టించేకోలేదన్నారు. మూడు రోజులుగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన అనంతరమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు.

(విజయనగరం టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి జ్వాలలు)

త్రిమూర్తులు రాజు నిర్ణయానికి పార్టీలోని మెజారిటీ ప్రజలు అండగా నిలిచారు. ఆయన నామినేషన్‌ ప్రక్రియకు కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. పార్టీ ఓడిపోయేవారికి టికెట్‌ ఇచ్చిందని.. అందుకే పార్టీని బ్రతికించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు త్రిమూర్తులు రాజు వ్యాఖ్యానించారు. త్రిమూర్తులు రాజును ఎలాగైనా బుజ్జగించి.. పోటీలో లేకుండా చేయాలనే టీడీపీ నేతల ప్రయత్నాలు ఫలించలేదు.

పార్టీ ప్రకటనకు ముందే రెబల్‌గా నామినేషన్‌..
అనంతపురం: కల్యాణదుర్గం టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుండటంతో.. పార్టీ అభ్యర్థిని ప్రకటించకముందే సిట్టింగ్‌ ఎమ్మెల్యే రెబల్‌గా బరిలోకి దిగారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. టికెట్‌ ఖరారు కాకముందే నామినేషన్‌ వేయడంపై ఆయన వ్యతిరేక వర్గం భగ్గుమంటుంది. హనుమంతరాయ చౌదరి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారని వారు  ఆరోపిస్తున్నారు. పార్టీ తరఫున టికెట్‌ వచ్చినా.. రాకపోయిన పోటీ చేసి తీరుతానని హనుమంతరాయ చౌదరి స్పష్టం చేశారు.

మాల్యాద్రిని చిత్తుగా ఓడిస్తాం..
గుంటూరు: తాడికొండ టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రవణ్‌కు కేటాయించకపోవడం ఆయన వర్గం కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. శ్రవణ్‌కు టికెట్‌ కేటాయించాలని సీఎం నివాసం వద్ద కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. తాడికొండ టికెట్‌ మాల్యాద్రికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్‌కు టికెట్‌ ఇవ్వకపోతే.. మాల్యాద్రిని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎంపీ సుజనా చౌదరి అండతోనే మాల్యాద్రికి సీటు ఇచ్చారని విమర్శిస్తున్నారు. మల్యాద్రి ముసుగులో రాజధానిలో అవినీతికి పాల్పడాలని సుజనా చూస్తున్నారని ఆరోపించారు. మాల్యాద్రిని గ్రామాల్లోకి కూడా రానివ్వమని టీడీపీ కార్యకర్తలు తేల్చిచెప్పారు.

తూర్పు గోదావరిలో అసంతృప్త జ్వాలలు..
తూర్పుగోదావరి: జిల్లాకు చెందిన పలువురు అసంతృప్త నేతలు బాహాటంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం ఏజెన్సీలో వంతల రాజేశ్వరి ఎంపికపై విలీన మండలాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పులపర్తి నారాయణమూర్తికి పి గన్నవరం టికెట్‌ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు.

మరిన్ని వార్తలు