సాక్షి, స్టేషన్ఘన్పూర్: తన కుమార్తెకు టిక్కెట్ రాలేదన్న అసంతృప్తితో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎట్టకేలకు మౌనం వీడారు. స్టేషన్ఘన్పూర్లో తాటికొండ రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టిక్కెట్ తన కుమార్తె కావ్యకు ఇవ్వకపోవడంతో కొంతకాలంగా అంటిముట్టనట్టు వ్యవహరించిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంగళవారం ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ పాల్గొన్న ఈ సభలో కడియం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి లేదు, సమ్మతి లేదంటూనే రాజయ్యకు చురకలు అంటించారు.
‘నేను నియోజకవర్గానికి రాకపోవడంతో అలిగానని బహుశా మీరంతా అనుకుంటున్నారేమో. నేను నిజంగా చెబుతున్నా రాజయ్య అప్పుడప్పుడు నా పట్ల తప్పుగా ప్రవర్తించినా నేను ఎన్నడూ అలా ప్రవర్తించలేదు. రాజయ్య నా తమ్ముడు. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు. రాజయ్యను తప్పకుండా మనమందరం గెలిపించుకోవాలి. భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాల’ని కడియం శ్రీహరి అన్నారు.