‘మా పాక్షిక మేనిఫెస్టోకే బెంబేలు’

19 Oct, 2018 12:08 IST|Sakshi

వరంగల్‌: తమ మేనిఫెస్టోను మక్కి మక్కి కాపీ కొట్టారంటున్న టీపీసీసీ నేతలపై తాజా మాజీ మంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ ప‍్రకటించిన పాక్షిక మేనిఫెస్టోను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని శ్రీహరి విమర్శించారు.  టీఆర్‌ఎస్‌ పాక్షిక మేనిఫెస్టోకే భయపడిపోతున్న కాంగ్రెస్ నేతలు‌.. తమ పూర్తి మేనిఫెస్టోను చూస్తే పోటీ చేస్తారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. శుక్రవారం ప్రెస్‌ మీట్‌లో మాట్లాడిన కడియం శ్రీహరి..  టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కంటే బెటర్‌ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ ప్రకటించి చూపాలని సవాల్‌ చేశారు.

‘కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించకుండానే...కాపీ కొట్టారని , మక్కి మక్కి జిరాక్స్ చేశారని  విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. అధికారం కోసం కాంగ్రెస్ సాధ్యం కానీ హామీలిస్తూ.. ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ నేతలంతా కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు.  దోపిడీ దొంగలంతా కాంగ్రెస్ లోనే ఉన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో టీఆర్ ఎస్ సర్కార్ పని చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ కులాల్లోని ప్రతి కుటుంబానికి లాభం చేకూర్చే ప్రణాళికలు రూపొందించ బోతున్నాం. పెన్షన్ల పెంపు తో 6 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వెదుకొన్నాం.  మొత్తంగా 48 నుండి 60 వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. మా పూర్తి మేనిఫెస్టోను చూస్తే..అసలు మీరు పోటీలో ఉంటారా’ అని కడియం ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు