ప్రపంచ స్థాయి ప్రమాణాల కోసమే....

29 Mar, 2018 18:28 IST|Sakshi
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచస్థాయి ప్రమాణాలున్నవిద్యావకాశాల కోసమే ప్రైవేట్‌ యూనివర్సిటీలకు అవకాశమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల స్థాపనతో తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ‘ప్రైవేట్‌ యూనివర్సిటీల స్థాపన, నియంత్రణ బిల్లు’ను శాసన మండలి ఆమోదించింది. ఈ సందర్భంగా శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ యువతకు విద్యావకాశాలు విస్తృతం చేయడం కోసమే ప్రైవేట్‌ యూనివర్సీటీలకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసమే 25 శాతం తెలంగాణ వాసులకు దక్కేలా నిబంధన విధించామని చెప్పారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఉన్నాయని గుర్తుచేశారు.

యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలకు లోబడి ఆ యూనివర్సిటీలు పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్సష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే అత్యధిక ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో ఒకలా...ఇక్కడ మరో విధంగా భాజపా విధానం ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అవసరానికి మించిన కాలేజీలు ఉన్నాయని, వాటిని నియంత్రిస్తామని మంత్రి పేర్కొన్నారు.  ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే 1016 పోస్టులకు ఇప్పటికే అనుమతి ఇచ్చామన్నారు.

మరిన్ని వార్తలు