నా తప్పు ఉంటే రాజీనామాకు సిద్ధం: కాకాణి

14 Mar, 2020 14:09 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నామినేషన్‌ వేయనీయకుంటే వేలాది మంది టీడీపీ అభ్యర్థులు ఎలా నామినేషన్లు వేశారని ప్రశ్నించారు. శనివారం ఆయన జిల్లాలో మాట్లాడుతూ.. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడిందో దానికి తనే ప్రత్యక్ష సాక్షి అని పేర్కొన్నారు. అప్పట్లో అదనపు డీజీ వెంకటేశ్వరరావు దగ్గర ఉంటూ వైఎస్సార్సీపీ నేతలను పలు రకాలుగా హింసించి, తప్పుడు కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద దాడి చేశారని అన్నారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోలేదా అని, అప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. (టీడీపీకి సవాలు విసిరిన ఎమ్మెల్యే కాకాణి)

అలాగే ‘‘జడ్పీ చైర్మన్‌ ఎన్నికల్లో సాక్షాత్తూ కలెక్టర్‌పై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి దాడి చేస్తే దిక్కు లేదు. అప్పుడు ఎందుకు చంద్రబాబు మాట్లాడలేదు.నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి.. వాస్తవాలు విస్మరించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పొదలకూరులో పంట కాలువను ఆక్రమించి ఇల్లు కడుతుంటే పంచాయతీ అధికారులు అడ్డుకోవడం తప్పా.. గత ఏడాది అధిక వర్షాలు పడినప్పుడు ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు రావడంతో దానిని రాజకీయం చేస్తున్నారు. ఆక్రమణలు ఏ పార్టీ వారివైనా తొలగించాలని కోరుతున్నాం. టీడీపీ తరపున పోటీచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారు. దమ్ము.. ధైర్యం.. నిజాయితీ.. ఉంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి. నా తప్పు ఉంటే రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నా’’నని ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. (ఆ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కుమార్తె చేయూత)

మరిన్ని వార్తలు