కేసీఆర్‌ భోళా శంకరుడు: కవిత

3 Apr, 2019 14:45 IST|Sakshi

సాక్షి, కోరుట్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భోళా శంకరుడని ఏదడిగితే అది వెంటనే అమలు చేస్తారని టీఆర్‌ఎస్‌ నిజమాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్‌ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గెలిపించారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీలు ఉంటే అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంలో మార్పు రావాలంటే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లలో గెలవాలని కోరారు.  

తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేసిందని ఆమె తెలిపారు. సబ్బండ వర్ణాలు బాగుపడటమే కేసీఆర్‌ లక్ష్యం అని అన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే పార్టీలను నమ్మకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలని కోరారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ రెండేళ్లలో ఇళ్లు కట్టించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర రెట్టింపు చేస్తామని చెప్పి.. ఆ హామీని పట్టించుకోలేదని కవిత విమర్శించారు.

కాగా, కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్య ర్థులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంత పెద్ద ఎత్తున​ అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ అక్కడ ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు బరిలో నిలవడంతో ఈ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని వార్తలు