జెడ్పీ చైర్‌పర్సన్‌గా దఫేదార్‌ శోభ!

6 Jun, 2019 09:52 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవికి నిజాంసాగర్‌ జెడ్పీటీసీ సభ్యురాలు దఫేదార్‌ శోభ పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత జెడ్పీటీసీ సభ్యులను హైదరాబాద్‌కు తరలించారు. జిల్లాలో 22 జెడ్పీటీసీలకుగాను టీఆర్‌ఎస్‌ పార్టీనుంచి 14 మంది సభ్యులు విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి చెందిన వారే జెడ్పీ చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌ పదవులు పొందనున్నారు. జెడ్పీ చైర్మన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు కాగా, ప్రస్తుత జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు భార్య శోభ నిజాంసాగర్‌ నుంచి గెలుపొందడంతో ఆమెను జెడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేశారు.

వైస్‌ చైర్మన్‌గా..
జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ పదవిని కామారెడ్డి నియోజక వర్గానికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పార్టీ అధిష్టానాన్ని కోరారని సమాచారం. తనకు మొదటి నుంచి ముఖ్య అనుచరుడిగా ఉన్న మాచారెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు మిన్కూరి రాంరెడ్డి పేరును సూచించినట్లు తెలిసింది. బీబీపేట జెడ్పీటీసీ సభ్యుడు ప్రేమ్‌కుమార్‌ కూడా వైస్‌చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. మిన్కూరి రాంరెడ్డికే వైస్‌ చైర్మన్‌ పదవి దక్కుతుందని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు