కేసీఆర్‌పై గద్దర్‌ పోటీ!

12 Aug, 2018 02:42 IST|Sakshi

టీ మాస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య

వనపర్తి అర్బన్‌: బహుజనులు కోరుకుంటే 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై బడుగుల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్‌ను పోటీకి దింపాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టీ మాస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచ ఐల య్య తెలిపారు. వనపర్తిలో టీ మాస్‌ ఆధ్వర్యంలో ‘బహుజనులకు రాజ్యాధికారం – ఉద్యోగుల పాత్ర’అనే అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

  అగ్రవ ర్ణ పాలకులు బహుజనులకు బతుకుదెరువు లేకుండా చేయడాన్ని సహించలేకే ప్రజా సం ఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో టీ మాస్‌ కూటమిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బహుజనులు రాజ్యాధికారం దక్కించుకునేలా గ్రామగ్రామానా ప్రజలను చైతన్యం చేయడంతోపాటు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నించేలా సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.  

విమలక్కతో చర్చిస్తున్నాం..
రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు లేదా మహిళా అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా టీ మాస్‌ 119 నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని కంచ ఐలయ్య వివరించారు. పోటీ విషయంలో గద్దర్‌ను ఇప్పటికే ఒప్పించగా.. అరుణోదయ నాయకురాలు విమలక్కను కూడా ఎన్నికల బరిలో నిలిపేందుకు ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ చెబుతున్న కేజీ టు పీజీ పథకం తన ఆలోచనేనని ఐలయ్య పేర్కొన్నారు. గ్రామాల్లో ఆర్థిక స్వాలంబన సాధించేందుకు పూచీకత్తు లేకుండా రూ.లక్ష రుణాలు ఇచ్చి పేదలు వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సాహిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు