బాబు ఓటమిని హుందాగా స్వీకరించు: కన్నా

13 Apr, 2019 15:59 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్‌ వేదికగా మరోసారి విమర్శస్త్రాలు సంధించారు. ’చంద్రబాబు...! అసలు ఈవీఎం కనిపెట్టమని చెప్పిందే నువ్వు కదా!. వీవీ ప్యాట్‌లో ఎవరికి ఓటు పడిందో చూసి కూడా ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి?. ఓ‍టమిని హుందాగా స్వీకరించలేని నీ గోల ప్రజలు పట్టించుకోవడం లేదని గ్రహించు. ఇక పచ్చ మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించలేవు. ప్రజలే నిన్ను సాగనంపడానికి బాధ్యతగా ఓటు వేశారు.’ అంటూ ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. 

‘యూ టర్న్ బాబు, ఈవీఎంల విషయంలో ఆడలేక మద్దెల ఓడు లాగా ఉంది నీ వ్యవహారం.. సిగ్గు లేకుండా అవినీతి చేసి బుకాయించడం, రాజ్యాంగ సంస్థల పట్ల నమ్మకం లేకపోవడం, గుడ్డ కాల్చి పక‍్కన వాళ్లమీద వేయడం, ఎన్నికల అయిపోయినా ఇంకా ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ పిచ్చి వేషాలు. ఓటమి భయం నిన్ను మరింత దిగజారేలా చేస్తోంది.’ అంటూ చంద్రబాబుపై కన్నా మండిపడ్డారు.

కాగా ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు వెళ్తోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసీ పూర్తిగా విఫలం అయ్యిందంటూ ఆయన ఆరోపణలు కూడా చేశారు. దీనిపై చంద్రబాబు ఇవాళ సీఈసీకి 18 పేజీలతో కూడిన లేఖను సమర్పించారు.

మరిన్ని వార్తలు