‘టీడీపీ, జనసేన నుంచే ఎక్కువ’

22 Jul, 2019 13:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ: తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మైనారిటీ నేత ఖాజా అలీ సోమవారం ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీజేపీలోకి చేరికలు నిత్యం కొనసాగుతున్నాయని చెప్పారు. జనసేన, టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి చేరికలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న చిత్తశుద్ధి చూసి బీజేపీ వైపు అందరూ వస్తున్నారని వ్యాఖ్యానించారు. మైనారిటీ, బీసీ, దళిత వర్గాల నుంచి చేరికలు ఎక్కువగా వున్నాయని తెలిపారు.

మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు జనసేన నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్ బీజేపీలో చేరారు. కాగా,  చంద్రబాబు నాయుడిపై విసుగుతోనే టీడీపీ నేతలు పార్టీ వీడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ అంతకుముందు అన్నారు. ఫిరాయింపులపై చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదని, ప్రధాని మోదీ పనితీరును చూసి టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని వివరించారు. 

మరిన్ని వార్తలు