‘బాబు అడుగుపెట్టారు.. కాంగ్రెస్‌ కనుమరుగైంది’

24 Dec, 2018 13:16 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగు పెట్టారు.. కాంగ్రెస్‌ కనుమరుగైందని, వచ్చే ఎన్నికల్లో దేశంలో కూడా కాంగ్రెస్‌ కనపడదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, అక్రమాలలో కూరుకుపోయిందన్నారు. అన్ని పథకాలలో కూడా కమీషన్లు తీసుకుంటున్నారని, టీడీపీ నేతలు మట్టి, ఇసుకను కూడా భారీగా దోచుకుంటున్నారని ఆరోపించారు. 

ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులని కేంద్రం ఏపీకి ఇచ్చిందని చంద్రబాబు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఈ వివరాలు పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని వెల్లడించారు. వాటికి చంద్రబాబు తన పేరు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం 9 లక్షల ఇళ్లను ఇస్తే ఇప్పటివరకు లక్షన్నర ఇళ్లు కూడా పూర్తి కాలేదన్నారు.

మరిన్ని వార్తలు