‘మోదీ మరో సారి ప్రధానమంత్రి అవడం దేశానికి అవసరం’

13 Jan, 2019 15:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఉంది కాబట్టే చం‍ద్రబాబు భయపడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విమానాశ్రయంలో దాడి జరిగింది కాబట్టి కేంద్రానిదే బాధ్యత అన్న చంద్రబాబు... ఇప్పుడు కేంద్రానికి సహకరించమని చెబుతున్న మాటలను ప్రజలకు అర్థం చేసుకోవాలని కోరారు. 

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను అవినీతి పేరుతో చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు దోచుకున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే దేశాభివృద్ధి గా భావించి పథకాల కేటాయింపుల్లో నరేంద్ర మోదీ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

వాల్మీకీ, బోయల సమస్యను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. నరేంద్ర మోదీ మరో సారి ప్రధానమంత్రి అవడం దేశానికి అవసరమని చెప్పారు. అరాచక శక్తుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.

మరిన్ని వార్తలు