టీడీపీ సంస్కారహీనుల పార్టీ : కన్నా

11 Jun, 2018 17:31 IST|Sakshi
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ(పాత చిత్రం)

సాక్షి, విజయవాడ : టీడీపీ అంటే తెలుగుదేశం సంస్కార హీనుల పార్టీ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రోజు తాము ధర్నా చేస్తే దానికి పోటీగా టీడీపీ నాయకులు ధర్నా చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షం అంటే టీడీపీ నాయకులకు విలువే లేదని వ్యాఖ్యానించారు. కొత్త వాళ్లకు పార్టీలో చోటు కల్పిస్తామని, ఏ పార్టీ వారు వచ్చినా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు.

‘రాజకీయ పక్షాలంటే గౌరవం లేదు. రాష్ట్రాన్ని దోచుకుతిని టీడీపీ నాయకులకు కళ్లు కనబడటం లేదు. వైఎస్సార్‌ సీపీకి, జనసేనకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని టీడీపీ ప్రచారం మొదలెట్టింది. 2019లో టీడీపీకి మ్యానిఫెస్టో లేదు. 2014లో అన్ని కులాలకు హామీలిచ్చి మోసం చేశారు. అందుకే ఎవరికి ఓటేసినా బీజేపీకే పడతాయని దుష్ప్రచారం చేస్తున్నారు. పోలవరానికి మొన్ననే కేంద్రం రూ.1400 కోట్లు విడుదల చేసింది. పోలవరానికి ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి పైసా కూడా బాకీ లేం’అని కన్నా స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు