వైఎస్‌ జగన్‌కు సన్మానం

2 Aug, 2018 14:09 IST|Sakshi
వైఎస్‌ జగన్‌ను సన్మానించిన మహిళలు

సాక్షి, గొల్లప్రోలు: తమ సామాజిక వర్గానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలపై కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుష్క వాగ్దానాలు చేయకుండా, నికార్సైన హామీలు ఇచ్చిన రాజన్న తనయుడిని మనసారా అభినందిస్తున్నారు. ‘అబద్ధాలు చెప్పలేను.. ఏం చేయగలనో అదే చెబుతానంటూ’ జనవాహిని సాక్షిగా ప్రమాణం చేసిన జననేతకు ధన్యవాదాలు చెబుతున్నారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని గురువారం కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు కలిశారు. తమ కులానికి జననేత ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేశారు. పుష్పగుచ్చాలు ఇచ్చి, శాలువా కప్పి జగన్‌ను సన్మానించారు. వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పి. పద్మావతి, చిట్నీడి సత్యవతి తదితర నాయకురాళ్లు.. జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. తాము అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీయిచ్చిన సంగతి తెలిసిందే.

వైఎస్సార్‌ సీపీలోకి సముద్రాల
ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపరిచేందుకు పలువురు నాయకులు ముందుకు వస్తున్నారు. అధికార టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. తాజాగా విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన టీడీపీ నేత సముద్రాల ప్రసాద్‌.. నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు