కర్ణాటక బీజేపీలో రాజకీయ అసమ్మతి

30 May, 2020 09:18 IST|Sakshi

ఉమేశ్‌ కత్తి రహస్య విందుపై లుకలుకలు 

ప్రభుత్వానికి ఢోకా లేదన్న మంత్రులు 

ఇప్పటికే మూడుసార్లు అలకబూనిన ‘కత్తి’ 

కరోనా సమయంలో బీజేపీలో అసమ్మతి సెగలు 

సాక్షి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సంక్రమిస్తున్న తరుణంలో కన్నడ నాట రాజకీయ అసమ్మతి తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పారీ్టకి ప్రమాదం ముంచుకొస్తోందని పుకార్లు షికారు చేశాయి. అయితే అసమ్మతి ఎమ్మెల్యేగా ముద్ర వేసుకున్న ఉమేశ్‌ కత్తి మరోసారి తన నివాసంలో గురువారం రాత్రి కొందరు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం నుంచి రాజకీయంగా చర్చ మొదలైంది. అంతేకాకుండా ఉమేశ్‌ కత్తిని తన ఇంటికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఆహ్వానించారు. ఉమేశ్‌ కత్తి బెంగళూరులోని సీఎం నివాసం సమావేశమై అనంతరం మీడియాతో మాట్లాడారు. తన నివాసంలో సమావేశానికి.. రాజకీయానికి సంబంధం లేదని కొట్టి పారేశారు. రహస్య సమావేశంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు.  

రేణుకాచార్య ఏమన్నారంటే..  
ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప నాయకత్వంపై తమకందరికి విశ్వాసముందని, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎంపీ రేణుకాచార్య తెలిపారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ  యడియూరప్ప ఎమ్మెల్యేలందరి విశ్వాసంతో పాలన అందిస్తున్నారన్నారు. సీఎం నాయకత్వంపై ఎవరికీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. చిన్నపాటి వివాదాలున్నా పరిష్కరించేందుకు పార్టీ ప్రముఖులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం యడియూరప్ప కరోనా సమస్యను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే 

 
కష్టసుఖాలు మాట్లాడుకున్నాం  : ఉమేశ్‌ కత్తి
బీజేపీలో బాధ్యతాయుత ఎమ్మెల్యేలుగా ఉన్నాం. అందరూ కలిసి భోజనం చేశాం. కష్టసుఖాల గురించి మాట్లాడుకున్నాం. ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదు. బీజేపీలో తిరుగుబాటు లేచిందని, ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించారనే వార్తల్లో నిజం లేదు. మా నాయకుడు మోదీ ప్రభుత్వం మరో మూడేళ్లు ఉండాలని కోరుకున్నాం. రాజ్యసభ స్థానం గురించి ఎలాంటి చర్చలు జరుగలేదు. చదవండి: ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత


తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాదు :  యత్నాళ్‌ 
తాము తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాదని.. ప్రభుత్వాన్ని కూల్చటం లేదని ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తల్లో నిజం లేదన్నారు. లాక్‌డౌన్‌ ద్వారా హోటల్‌ బంద్‌ అయిన కారణంగా ఉమేశ్‌ కత్తి ఇంట్లో విందుకు వెళ్లామన్నారు.  

ప్రభుత్వానికి ఢోకా లేదు :  మంత్రి బీ.సీ.పాటిల్‌ 
నాయకత్వ మార్పు ఎట్టి పరిస్థితిలోను ఉండబోదని.. మరో మూడేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం భద్రంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి బీసీ.పాటిల్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా యడియూరప్ప సమర్థ పాలన అందిస్తున్నారన్నారు. స్నేహితులందరు ఒకచోట కలిస్తే తప్పుగా భావించడం సరికాదన్నారు. 

మరిన్ని వార్తలు