మంత్రివర్గం : కాంగ్రెస్‌ 14, జేడీఎస్‌ 7

6 Jun, 2018 13:04 IST|Sakshi

బెంగుళూరు : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు చేయనుంది. మిత్రపక్షం కాంగ్రెస్‌కు 14 మంత్రి పదవులు, జేడీఎస్‌కు 7 మంత్రి పదవులు దక్కనున్నాయి. అలాగే బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌ మహేష్‌ను, కేజీపే పార్టీ అభ్యర్థిని కూడా కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. బీఎస్పీ కూడా కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కర్ణాటక కాంగ్రెస్‌ అగ్రనాయకులు, జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించి ఆయన ఆమోదంతో మంత్రి పదవులు ఖరారు చేశారు. రాహుల్‌ ఆమోదం పొందిన జాబితా అందిన తర్వాతనే సీఎం కుమారస్వామి మంత్రివర్గ ఏర్పాటుకు పూనుకున్నట్టు సమాచారం.

కాగా కాంగ్రెస్‌ నాయకుడు డీకే శివకుమార్‌కు కీలక మంత్రి పదవీ దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాహుల్‌ గాంధీ ఆమోదం తెలిపిన అభ్యర్థుల జాబితాలో డీకే పేరుతో పాటు కేజే జార్జ్‌, ప్రియంకా ఖార్గే పేర్లు కూడా ఉన్నట్టు ఏఎన్‌ఐ తెలిపింది. కాగా రానున్న 2019 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్‌ గాంధీ అన్ని వర్గాలకు సమప్రాధాన్యతను ఇచ్చినట్టు సమాచారం. తర్వాతి కాలంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా కీలక మంత్రి పదవులను రెండు పార్టీలు సమానంగా పంచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు