రాజీనామా చేస్తే పది కోట్లు, మంత్రిపదవి

14 Feb, 2019 04:04 IST|Sakshi

కర్ణాటకలో మరో ఆడియో టేపు

జేడీఎస్‌ ఎమ్మెల్యేకు యెడ్డీ ఆఫర్‌ చేసినట్లుగా ఆరోపణ

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆడియో టేపుల వ్యవహారం సెగలు పుట్టిస్తోంది. జేడీఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టాలని ప్రయత్నించినట్లుగా ఉన్న మరో ఆడియోటేపు తాజాగా బయటకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఒక టేపును ఈ నెల 8న స్వయంగా సీఎం కుమారస్వామి విడుదల చేయడం తెలిసిందే. ఈ నెల 7న బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప జేడీఎస్‌ ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ఆయన కుమారుడు శరణ గౌడలతో మాట్లాడినట్లుగా చెబుతున్న మరో ఆడియో టేపు తాజాగా జేడీఎస్‌ వర్గాల ద్వారా బయటకొచ్చింది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే ఒక్కొక్కరికి రూ. 10 కోట్లు ఇస్తామని, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి తామే గెలిపించుకోవడంతోపాటు మంత్రి పదవి కూడా ఇస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చినట్లుగా ఆ టేపులో ఉంది.

నువ్వే మంత్రివి కావచ్చు..
టేపులో ఉన్న దాని ప్రకారం శరణగౌడతో యడ్యూరప్ప మాట్లాడుతూ ‘మొదటి మీ నాన్నతో రాజీనామాకు ఒప్పించు. ముంబై లోని హోటల్‌లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నీవు అక్కడికి వెళ్లు. సాయంత్రానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు అయ్యాక అందరు కలసి ఒకేసారి రాజీనామా చేయండి. ఆ వెంటనే మొదట మీ ఇంటికి రూ. 20 కోట్లు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ నా కొడుకు బీవై విజయేంద్ర చూసుకుంటాడు. ఉప ఎన్నికల్లో నిన్ను గెలిపించి, మంత్రిని కూడా చేస్తాము. లోక్‌సభ ఎన్నికల తర్వాత జేడీఎస్‌ పార్టీ ఎక్కడికిపోతుందో ఎవరికీ తెలియదు’ అని సూచించారు.

శివనగౌడ మాట్లాడుతూ రాజీనామా చేస్తే స్పీకర్‌ వెంటనే దాన్ని అంగీకరించరేమో.. అని చెప్పబోతుండగా మళ్లీ యడ్యూరప్ప.. ‘దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవ సరం లేదు. సమావేశాలు ముగిసేలోగా రాజీనామాలను స్పీకర్‌ అంగీకరించి తీరాల్సిందే. అదం తా పెద్దలు చూసుకుంటారు. ప్రధాని, అమిత్‌ షా, గవర్నర్‌ చూసుకుంటారు. నిన్ను మంత్రిని చేయడమే కాకుండా యాదగిరి జిల్లాకు ఇంచార్జిని కూడా చేస్తాం. రాజీనామాకు అంగీకరిస్తే సాయంత్రంలోగా రాయ చూరులోని మార్వాడిల నుంచి రూ. 20 కోట్లు అందిస్తాం’ అని చెబుతున్నట్లుగా ఉంది.

మరిన్ని వార్తలు