కన్నడ సంక్షోభం: కుమారస్వామీ.. రాజీనామా చేయ్‌..!

8 Jul, 2019 10:20 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కారు ఉంటుందా? ఊడుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ముంబైలో మకాం వేయడంతో రసవత్తర పొలిటికల్‌ డ్రామా కొనసాగుతోంది. కన్నడ రాజకీయ సంక్షోభానికి సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవి..

లోక్‌సభలో ‘కర్ణాటక’దుమారం!
ఢిల్లీ: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం లోక్‌సభను కుదిపేసింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి సభలో మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 303 ఎంపీ సీట్లు గెలిచినా బీజేపీ కడుపు నిండడం లేదని, అందుకే కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ విమర్శలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దీటుగా బదులిచ్చారు. కర్ణాటక సంక్షోభంలో తమ ప్రమేయం లేదని, కాంగ్రెస్‌లోనే రాజీనామాల పరంపర కొనసాగుతోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మొదలుకొని.. అందరూ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, రాజీనామాలు ఆ పార్టీ అంతర్గత విషయమని చెప్పారు.

కుమారస్వామీ.. రాజీనామా చేయ్‌..!
కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారం నేపథ్యంలో బీజేపీ క్రమంగా పట్టు బిగిస్తోంది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతృత్వంలోని కుమారస్వామి ప్రభుత్వం పూర్తిగా మైనారిటీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి సాయంత్రం 5 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప భేటీ అవుతున్నారు. ఈ భేటీ నేపథ్యంలో యడ్యూరప్ప నివాసానికి వచ్చిన బీజేపీ సీనియర్‌ నేత శోభా కర్లందాజే మీడియాతో మాట్లాడారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని, ఆయన మెజారిటీ కోల్పోయారని శోభా డిమాండ్‌ చేశారు.  రాజీనామాతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని కుమారస్వామిని ఆమె కోరారు. స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్‌ మంత్రి పదవికి రాజీనామా చేసి.. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడాన్ని ఆమె స్వాగతించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎమ్మెల్యేలు మద్దతిస్తే తాము స్వీకరిస్తామని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలతో తమకు సంబంధం లేదన్నారు.

మంత్రులందరి రాజీనామా

  • ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ముంబైలో క్యాంప్‌ వేసిన నేతలను బుజ్జగించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా కుమారస్వామి కేబినెట్‌లోని మంత్రులందరూ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర సహా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 22మంది, జేడీఎస్‌కు చెందిన 10 మంది తమ మంత్రి పదవులను త్యజిచేందుకు సిద్ధపడ్డారు.
    (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి: కాంగ్రెస్‌ ప్లాన్‌ బీ)


(స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్‌ గవర్నర్‌కు సమర్పించిన లేఖ)

సంకీర్ణ సర్కార్‌కు మరో భారీ షాక్‌

  • సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి మరో గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటికే 13మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. తాజాగా మరో స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి కూడా రాజీనామా బాట పట్టారు. స్వతంత్ర ఎమ్మెల్యే అయిన నాగేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే.. బీజేపీ సర్కారుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని నాగేశ్‌ వెల్లడించారు. ఈ ఏమేరకు గవర్నర్‌ వజుభాయ్‌ వాలాను కలిసి లేఖలు అందించారు. ఇక, ఇప్పటికే రాజీనామా చేసిన 13 మంది ఎమ్మెల్యేలకు తోడు మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే బెలగావి అంజలి నింబల్కర్‌, మరో ఎమ్మెల్యే బాగేపల్లి సుబ్బారెడ్డి సోమవారం రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది.

సీఎం రేసులోకి మరో నేత.. పోస్టర్లతో కలకలం

  • కర్ణాటకలో తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి పదవి కోసమే సీఎల్పీ నేత సిద్దరామయ్య ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి ఆజ్యం పోసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ అసంతృప్త ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి రామలింగారెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టర్లు వెలువడ్డాయి. ప్రస్తుత సంక్షోభ నివారణకు రామలింగారెడ్డిని సీఎంను చేయాలంటూ పోస్టర్లు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న రామలింగారెడ్డిని సీఎం కుమారస్వామి ఓ రహస్య ప్రదేశంలో కలిసి బుజ్జగించినట్టు వార్తలు వస్తున్నాయి.
     
  • కర్ణాటక రాజకీయ సంక్షోభం పార్లమెంటు ముందుకు వచ్చింది. కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.
     
  • ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలో ఇరకాటంలో పడిన కాంగ్రెస్‌ పార్టీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే బెలగావి అంజలి నింబల్కర్‌, మరో ఎమ్మెల్యే బాగేపల్లి సుబ్బారెడ్డి సోమవారం ఉదయం రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది.

(మీడియాతో మాట్లాడుతున్న జీ పరమేశ్వర)

మూకుమ్మడి రాజీనామాలకు రెడీ..
కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో డిప్యూటీ సీఎం పరమేశ్వర తన నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి బీజేపీ కారణమని, కమలం పార్టీ నేతలు తెరవెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఈ సమావేశంలో నేతలు భావించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే మంత్రి పదవులు త్యాగం చేయడానికి సిద్ధపడాలని ఈ సమావేశంలో పలువురు మంత్రులు ప్రతిపాదించినట్టు సమాచారం. తమ మంత్రి పదవులను వీడి.. వాటిని అసంతృప్తులకు కట్టబెడితే ప్రభుత్వం నిలబడుతుందని చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించామని, అవసరమైతే.. అందరం మూకుమ్మడిగా రాజీనామా చేసి.. అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర మీడియా తెలిపారు. ఈ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పార్టీ నాయకుడు సిద్దరామయ్య, మంత్రులు యుటి ఖాదర్, శివశంకరరెడ్డి, వెంకటరమణప్ప, జయమాల, ఎంబీ పాటిల్, కృష్ణ బైరే గౌడ, రాజ్‌శేఖర్ పాటిల్, డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు