బెంగళూరు చేరుకున్న ఎమ్మెల్యేల బృందం..

19 May, 2018 07:30 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. గవర్నర్‌ ఆహ్వానంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో శనివారం బలనిరూపణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు తరలి వెళ్లిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు తిరిగి శనివారం ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. ఆపరేషన్‌ లోటస్‌తో బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటుందనే భయంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీలు గురువారం రాత్రి ఈగల్టన్‌ రిసార్ట్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ తరలించింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో్ కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు తిరిగి బెంగళూరులోని హోటల్ హిల్టన్ చేరుకున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. మొత్తం ఐదు బస్సులో ఎమ్మెల్యేలను తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు తెలంగాణ చెందిన నేతలు కూడా వెళ్లారు. ప్రస్తుతం కర్ణాటక పోలీసుల భద్రతలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేల వాహనాలకు ముందు వెనుకా కాంగ్రెస్‌ శ్రేణుల వావానాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం యడ్యూరప్ప సర్కారు బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 
 

మరిన్ని వార్తలు