రాహుల్‌ వచ్చారు.. సిద్దయ్య పోతారు!

24 Mar, 2018 17:26 IST|Sakshi

కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై బీజేపీ విసుర్లు 

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కర్ణాటక ఎన్నికల్లో రాహుల్‌ ప్రచారం చేస్తుంటడంతో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం ఖాయమని ఎద్దేవా చేసింది. ‘రాహుల్‌ వచ్చారు. సిద్దరామయ్య వెళ్లిపోతారు’ అంటూ బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మురళీధర్‌రావు అన్నారు. రానున్న ఎన్నికల్లో సిద్దరామయ్య ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

‘గడిచిన ఐదు ఏళ్లలో సీఎం సిద్దరామయ్య ఏమీ చేయలేదు. ఇప్పటివరకు పడుకొని ఉండిపోయిన ఆయన.. ఇప్పుడు నిద్రలేచి.. తన కారునిండా ఇటుకలు పెట్టుకొని రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు.  ఎక్కడికి వెళితే.. అక్కడ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. సమయం ఉన్నప్పుడు ఏమీ చేయని సిద్దరామయ్య.. ఇప్పుడు నవకర్ణాటకను నిర్మిస్తున్నానని చెప్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారు’ అని మురళీధర్‌రావు మండిపడ్డారు. తుముకూరులో నిర్వహించిన బీజేపీ గొల్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాకటలో యాదవ సామాజికవర్గం జనాభా 35 లక్షల వరకు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు